కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా నిర్మల్ రూరల్ మండలం మేడిపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారి-44 (NH 44)పై గురువారం మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అంతకుముందు రెండు లారీలు ఢీకొని మంటలు చెలరేగడంతో ఓ డ్రైవర్ సజీవ దహనం కావడంతో పోలీసులు రహదారిపై వాహనాల రాకపోకలను వన్వేగా మళ్లించారు. ఈ క్రమంలో అదిలాబాద్ వైపు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఇన్నోవా కారు, ఎదురుగా అదిలాబాద్ వైపు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇన్నోవా డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఒకే రోజు, ఒకే ప్రదేశంలో వరుసగా రెండు రోడ్డు ప్రమాదాలు జరగడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది. ప్రమాదాలకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

