కలం, వెబ్ డెస్క్ : చిత్తూరు (Chittoor) జిల్లాలోని పులిచెర్ల (Pulicherla) మండలం కోటపల్లి అటవీ ప్రాంతంలో వేకువజామున ఒంటరి ఏనుగు (Lone Elephant) హల్చల్ చేసింది. అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన ఈ ఏనుగు సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి దూసుకెళ్లి పంటలను తొక్కి నాశనం చేసింది. ముఖ్యంగా మామిడి తోటలకు భారీ నష్టం కలిగించింది. పండ్లతో నిండిన చెట్లను విరగ్గొట్టడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఏనుగు అయినప్పటికీ దాని సంచారం వల్ల గ్రామస్థులలో భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే అప్రమత్తమై పరిస్థితిని పరిశీలించారు. ఏనుగును మళ్లీ అటవీ ప్రాంతంలోకి మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే సమీప గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, రాత్రివేళల్లో బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల కాలంలో అటవీ ప్రాంతాల నుంచి వన్యప్రాణులు బయటకు వస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో రైతులు, స్థానికులు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

