కలం, వనపర్తి: జిల్లాలో చేపట్టిన డబుల్ బెడ్రూం గృహాల నిర్మాణాలను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి (Collector Adarsh Surabhi) అధికారులను, కాంట్రాక్టర్ను ఆదేశించారు. మంగళవారం వనపర్తి (Wanaparthy) జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించిన ఆయన పనుల పురోగతిని సమీక్షించారు.
మొత్తం 48 గృహాలు స్లాబ్ దశలో ఉండగా, మరో రెండు గృహాలు బేస్మెంట్ దశలో ఉన్నాయని అధికారులు కలెక్టర్కు వివరించారు. పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయనే అంశంపై కాంట్రాక్టర్తో చర్చించిన కలెక్టర్ (Collector Adarsh Surabhi), నిర్దేశిత గడువులోగా అన్ని గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని స్పష్టం చేశారు. నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించరాదని, పనుల వేగాన్ని మరింత పెంచాలని సూచించారు.
పనులకు సంబంధించిన బిల్లులు త్వరితగతిన విడుదలయ్యేలా జిల్లా యంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పనుల అమలులో ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కాంట్రాక్టర్కు సూచించిన కలెక్టర్, అధికారులు కూడా నిరంతరం పనులను పర్యవేక్షిస్తూ పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో హౌసింగ్ పీడీ విటోభా, సంబంధిత శాఖల అధికారులు, పీఆర్ ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్, స్థానికులు పాల్గొన్నారు.
Read Also: పతకాల వేటలో భారత్.. నేడు కీలక ఈవెంట్స్
Follow Us On: Instagram

