కలం, వెబ్ డెస్క్: ఉన్నత చదువులు, మంచి ఉద్యోగం దొరికిన తరువాతనే పెళ్లి (Late Marriage) చేసుకుంటామనే యువత ధోరణి ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. ఈ ప్రభావం దేశ సంతానోత్పత్తి మీద కూడా పడుతోంది. అందుకే, చాలా రాష్ట్రాల్లో ఇదే విషయమై పెద్ద ఎత్తున అవగాహన చర్చలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబూ.. సింగపూర్ మాజీ ప్రధాని లీ క్వాన్ యూ వీడియో ఒకటి షేర్ చేయగా వైరలవుతోంది. అందులో ఆయన ఏం అన్నారంటే..
‘వ్యక్తిగత జీవితమే అన్నింటికన్నా ముఖ్యం’..
యువత పెద్ద పెద్ద చదువులు, ఉన్నతమైన కెరీర్ ఆశించడం తప్పు కాదని.. కానీ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేస్తే.. మొదటికే మోసం వస్తుందని లీ క్వాన్ యు హెచ్చరించారు. ఈ విషయాన్నే శ్రీధర్ సైతం కోట్ చేస్తూ, వయసు మీరిన తరువాత పెళ్లి చేసుకుంటున్నవారిలో సంతానోత్పత్తి సమస్యలు అధికంగా ఉంటున్నాయని తెలిపారు. భారత సామాజిక వ్యవస్థలో కుటుంబానికి విశిష్ట ప్రాధాన్యం ఉందని.. ఆర్థిక ఒత్తిళ్లు, కెరీర్ పేరు చెప్పి దాన్ని విచ్ఛిన్నం చేయొద్దని సున్నితంగా హెచ్చరించారు. ఇదే విషయాన్ని సామాజిక శాస్త్రవేత్తలు సైతం సూచిస్తున్నారు.

