కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి (Kamareddy) జిల్లా చుక్కాపూర్ అటవీ ప్రాంతంలో భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం సాయంత్రం విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. 28వ తేదీన ఉదయం హోమాలు, పూజలు, సంతానం కాని వారికి గరుడ ప్రసాదం పంపిణీ, సాయంత్రం వేళ పల్లకి సేవలు, బలిహరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
29వ తేదీన ఉత్సవ మూర్తులకు నవకలశ స్నపనము, 30వ తేదీన మూల మూర్తికి అష్టోత్తర శతఘటాభిషేకం, సాయంత్రం డోలోత్సవం జరుగుతాయి. మే 1వ తేదీన స్వామి వారి కల్యాణ మహోత్సవం, సాయంత్రం రథోత్సవం, పల్లకీ సేవలు కొనసాగుతాయి. మే 2వ తేదీ వరకూ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. మే 2న సాయంత్రం లక్ష్మీనర్సింహ స్వామి రథోత్సవ ఊరేగింపు, ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు.

