కలం, వెబ్ డెస్క్: ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి (MLA Sudheer Reddy) కాంగ్రెస్ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. శనివారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో 44కాలనీల లబ్దిదారులకు ఇండ్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన ధృవపత్రాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్తోపాటు సుధీర్ రెడ్డి కూడా హాజరయ్యారు.
మంత్రి పొంగులేటి లబ్దిదారులకు సేల్ డీడ్ పత్రాలు పంపిణీ చేస్తున్న క్రమంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రెండు గ్రూపుల మధ్య తోపులాట జరిగింది. మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ నేతలకు సుధీర్రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ప్రోటోకాల్ విషయంలో తనను కావాలనే అడ్డుకున్నారని మంత్రికి వివరించారు.
అనంతరం వేదికపై సుధీర్రెడ్డి మాట్లాడుతుండగా కాంగ్రెస్ నేతలు వెనుక నుంచి వ్యాఖ్యలు చేశారు. దీంతో సుధీర్ రెడ్డి ‘బిడ్డా జాగ్రత్త.. తొక్కుతా’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. కాసేపు గందరగోళం చోటుచేసుకుంది. పోలీసులు ఇరువర్గాలను సముదాయించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. తన నియోజకవర్గంలోని కార్యక్రమానికి లబ్దిదారులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని సుధీర్ రెడ్డి మండపడ్డారు. స్టేడియాన్ని కాంగ్రెస్ కార్యకర్తలతో నింపేశారని ఫైర్ అయ్యారు. కార్యక్రమానికి నా ఒక్కడికే అనుమతి ఇవ్వడమేంటని, లబ్దిదారులు లేకుండా ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు.

