కలం, కరీంనగర్: కరీంనగర్ లో ఈ నెల 23న జరిగే గణేష్ నిమజ్జన ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) అధికారులను ఆదేశించారు. శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్లతో కలిసి వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మేయర్ (Kolagani Srinivas) మాట్లాడుతూ.. మానకొండూరు, కొత్తపల్లి, చింతకుంటలతో పాటు గోపాల్పూర్, దుర్షెడ్, బొమ్మకల్ నూతన నిమజ్జన పాయింట్ల వద్ద క్రేన్లు, బారికేడింగ్, సీసీ కెమెరాలు, లైటింగ్, తాగునీరు, గజఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. నిమజ్జన మార్గాల్లో ప్యాచ్ వర్క్ పనులను రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
డిప్యూటీ మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ.. విద్యుత్ ప్రమాదాలు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ.. నిమజ్జన పాయింట్ల వద్ద సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్కు అనుసంధానిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ ఆయాజ్, డిప్యూటీ కమిషనర్లు, ఈఈ లచ్చిరెడ్డి, డీసీపీ బషీరొద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

