కలం, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలు (Kurnool Heavy Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానలకు జిల్లాలోని వాగులు, వంకలు ప్రమాదకరంగా పొంగిపొర్లుతున్నాయి. ఆలూరు నియోజకవర్గ పరిధిలోని హాలహర్వి వద్ద నడిమివంక వాగు, అలాగే హత్తిబెళగల్ సమీపంలో కళ్లెవంక వాగు అత్యంత ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీనివల్ల కర్నూలు, బళ్లారి, గుంతకల్లు, ఆలూరు ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి, రవాణా వ్యవస్థ స్తంభించింది.
మరోవైపు ఎమ్మిగనూరు పరిధిలో నిన్న అర్ధరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ప్రస్తుతానికి కూడా వర్షం తగ్గకపోవడంతో రహదారులన్నీ జలమయంగా మారాయి. గోనెగండ్ల మండలం అగ్రహారం, ఎమ్మిగనూరు మండలం కడివేళ్ల, నందవరం ప్రాంతాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అగ్రహారం, గంజాహళ్లి చెరువుల నీరు రోడ్లపైకి చేరడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బెంగళూరు, బళ్లారి నుంచి కర్నూలు వైపు వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

