కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలని, అనాధగా మారనివ్వకూడదని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు (Kuchadi Srihari Rao) వ్యాఖ్యానించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR)పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీహరి రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి.
రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని అన్నారు. అయితే ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో కాంగ్రెస్ పరిస్థితిపై నాయకులలోనే స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకర్తల సమస్యలను నాయకత్వం గమనించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల బాధను అర్థం చేసుకోవాలని, అభివృద్ధి పనులపై సరైన సమాచారం లేకపోవడం బాధాకరమని తెలిపారు. అవసరమైతే తాను ఇన్చార్జి పదవిని వదులుకుని సామాన్య కార్యకర్తగా కొనసాగుతానని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వంలో నిర్మల్ నియోజకవర్గానికి మంజూరైన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అడ్డుకున్నారని, వెంటనే దాన్ని మంజూరు చేయాలని కోరారు. పార్టీకి తగిన గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆవేదనను సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

