కలం, వెబ్ డెస్క్: మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) బయలుదేరారు. కాసేపట్లో హరీష్ రావు నివాసం నుండి జగిత్యాలకు కేటీఆర్, హరీష్ రావు బయలుదేరనున్నారు. ఈరోజు జగిత్యాలలో వీరు పర్యటించనున్నారు. ఈ నెల 20న జగిత్యాలలో జరగనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ‘ప్రజా ఆశీర్వాద సభ’ (KCR Public Meeting) ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. వేదిక నిర్మాణం, సభా ప్రాంగణంలోని సౌకర్యాలు, పార్కింగ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి ప్రజలకు అవసరమైన సదుపాయాలపై వారు సమీక్షించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పార్టీ కీలక నాయకులతో సమావేశమై, సభ నిర్వహణపై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
జగిత్యాల గడ్డనుంచే బీఆర్ఎస్ పార్టీ (BRS) పోరుబాట ప్రారంభించనుంది. రెండున్నరేండ్లుగా కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన చేస్తోందని, ఇందుకు వ్యతిరేకంగా గళమెత్తేందుకు ఈ నెల 20న జగిత్యాల వేదికగా మరో పోరుకు శ్రీకారం చుట్టనుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్రెడ్డితో పాటు వేలాది మంది కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ‘కేసీఆర్ రావాలి.. రేవంత్ పోవాలి’ అనే నినాదంతో జగిత్యాల జైత్రయాత్ర మొదలుకానుంది. ఇక్కడ నిర్వహించే భారీ భహిరంగ సభకు ముఖ్యఅతిథిగా కేసీఆర్ హాజరుకానుండడంతో సభను కేటీఆర్, హరీశ్ రావు ప్రత్యేకంగా తీసుకున్నారు. సభా ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. రేవంత్ పదవీ కాలం దాదాపు సగం ముగియడంతో రెండేండ్లలో రానున్న ఎన్నికల దృష్టా కేసీఆర్ ఇక్కడినుంచే సమరశంఖం పూరించారు. కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం కలిగిన జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి, కాంగ్రెస్కు గట్టి షాక్ ఇవ్వనుంది.

