కలం, వెబ్ డెస్క్: అడ్డగోలుగా హమీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Government).. అందరినీ మోసం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. సగంకాలం ముగిసినా ఒక్క హమీల అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఒక అట్టర్ ప్లాప్ సినిమా అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో లబ్ధిదారునికి ప్రభుత్వం రూ. 1.25 లక్షలు బాకీ ఉందని గుర్తుచేశారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేను కాంగ్రెస్లో చేర్చుకోవడం ప్రజా తీర్పును అవమానించడమేనని చెప్పారు. త్వరలో ఉపఎన్నికలు వస్తాయని.. ఆ ఉప ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పి, మళ్లీ బీఆర్ఎస్ను గెలిపిస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కనుమరుగు చేయాలని కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాదని విమర్శించారు. ప్రజలు ఈ అసమర్థ పాలనను ఇంకా రెండున్నర ఏళ్లు భరించాల్సి రావడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. నగరంలో హైడ్రా పేరుతో పేదల ఇళ్లను రేవంత్ సర్కార్ కూల్చివేస్తున్న కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఒక్క ఇటుక కూడా కొత్తగా పేదలకు ఇళ్లు కట్టించని ప్రభుత్వం, ఉన్న ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గమని అన్నారు. జీవో నెంబర్ 50 ద్వారా పేదలకు పట్టాలిచ్చిన ఘనత కేసీఆర్ది అని కొనియాడారు. హైదరాబాద్లో ఇటుక కూడా వేయని కాంగ్రెస్, హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గమని చెప్పారు.

