కలం, వెబ్ డెస్క్: కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మూసీ అభివృద్ధికి చేపట్టిన చర్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన ఆరోపణలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. మూసీ ప్రాజెక్టు కోసం కూలగొట్టే అపార్ట్మెంట్లో ముగ్గురు జర్నలిస్టులున్నారని, వారిని కాకా పట్టడానికి రేవంత్ శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
శుక్రవారం అధికారులు మూసీ సుందరీకరణ వెబ్సైట్లో కొన్ని ఫోటోలు పెట్టారని, ఆ ఫోటోలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన మూసీ సుందరీకరణ ఫోటోలేనని కేటీఆర్ గుర్తు చేశారు. 3,279 ఎకరాలు, 10వేల నిర్మాణాలు తీసుకుంటామని ప్రభుత్వం గెజిట్ ఇచ్చిందని, పక్కనే కోకాపేటలో ఎకరం 100 కోట్లు ఉంది, అక్కడ కనీసం 50 కోట్లు ఉండదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. లక్షన్నర కోట్ల విలువైన ఆస్తిని జీరో వాల్యూ చేసే అధికారం రేవంత్ రెడ్డికి ఎవరు ఇచ్చారని కేటీఆర్ మండిపడ్డారు.
‘‘గాంధీ మునిమనవడు కూడా గాంధీ విగ్రహం వద్దని చెప్తున్నారు. మేధా పాట్కర్ లాంటి మేధావులు కూడా రేవంత్ రెడ్డి చర్యలకు అడ్డు చెప్తున్నారు. నేను రియల్ ఎస్టేట్ గురించే ఆలోచిస్తా తప్పేంటి అని రేవంత్ రెడ్డి బహిరంగంగా అంటున్నాడు. మరి మూసీ ప్రాజెక్టు సుందరీకరణ కోసం చేస్తున్నాడా లేక భూముల కోసం చేస్తున్నాడు అనుకోవాలా’’ అని కేటీఆర్ ఎద్దేవా చేశాడు.

