కలం, వెబ్డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి తన స్థాయిని మరిచిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని KTR ఫైర్ అయ్యారు. ‘కేసీఆర్ను ముఖ్యమంత్రి కానివ్వను అని రేవంత్ రెడ్డి (Revanth Reddy) అంటున్నడు.. కానీ ఆయనను మేం వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంలోనే గెలవనివ్వము. అసెంబ్లీకి రానివ్వము‘ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ (KCR) ప్రెస్ మీట్ పెడితేనే రేవంత్ రెడ్డి వణికిపోతున్నాడని.. ఇక అసెంబ్లీకి వస్తే గుండె ఆగి చచ్చిపోతాడని అన్నారు. ‘నేను తండ్రి పేరు చెప్పి రాజకీయం చేస్తున్నానని రేవంత్ రెడ్డి అంటున్నాడు. బరాబర్ తండ్రి పేరు చెప్పి రాజకీయం చేస్తా. తన తండ్రి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మొగోడు అందుకే తండ్రి పేరు చెప్పుకుంటా‘ అంటూ కేటీఆర్ KTR వ్యాఖ్యానించారు.
గుంటూరులోనే చదివా అయితే ఏంటి?
తాను గుంటూరులో చదివానని.. అమెరికాలో బాత్రూమ్లు కడిగానని రేవంత్ రెడ్డి పదే పదే ఆరోపిస్తుంటారని.. ‘నేను గుంటూరులో చదివింది నిజమే. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ నుంచి వెళ్లి గుంటూరులో చదివా తప్పేంటి? అమెరికాలో ఎవరి ఇండ్లు వాళ్లే శుభ్రం చేసుకోవాలి. ఎవరి బాత్రూమ్ లు వాళ్లే కడుక్కోవాలి. అందులో తప్పేముంది‘ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్రెడ్డి లాగా తాను సదువు సంధ్య లేకుండా తిరగలేదని.. ఇంగ్లిష్ నేర్చుకున్నానని.. హిందీ, ఉర్దూ కూడా నేర్చుకున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏ భాష రాదని.. ఆయన ఆ భాషలు నేర్చుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి తన అల్లుడిని ఆంధ్రా నుంచి తెచ్చుకున్నారని.. మరి ఆయనను ఏమనాలి భీమవరం బుల్లోడు అనాలా? అంటూ KTR ఫైర్ అయ్యారు.
ఢిల్లీకి మూటలు మోయడం లేదు
తాము ఢిల్లీకి మూటలు మూయడం లేదని.. బీజేపీ నేతల కాళ్లు పట్టుకోవడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్థాయిని మరిచి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Read Also: ఎల్లుండి గ్రామాల్లో నిరసన తెలుపుతాం : టీపీసీసీ చీఫ్
Follow Us On: X(Twitter)


