కలం, నిర్మల్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లా పర్యటన సందర్భంగా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. శనివారం నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలు భారీగా తరలి వచ్చి ఆయనకు ఆత్మీయ స్వాగతం అందించారు. ఈ పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన రైతు నావర్గే పాండురంగ్ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించనున్నారు.
జొన్న పంటకు సరైన ధర లభించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన పాండురంగ్ ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. రైతు కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పడంతో పాటు, సమస్యలపై స్పందించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కేటీఆర్ పర్యటనతో బీఆర్ఎస్ శ్రేణులలో ఉత్సాహం నెలకొంది. ఈ కార్యక్రమంలో నిర్మల్ పట్టణ అధ్యక్షుడు మారుకొండ రాము, మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.

