కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లోని నందినగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)ను తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం (THCAA) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో కేవలం తెలంగాణ ప్రాంతానికి చెందిన న్యాయవాదుల పేర్లనే పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ సంఘం ఇటీవల తీసుకున్న తీర్మానాన్ని కేటీఆర్కు వివరించారు. సామాజిక న్యాయాన్ని పాటిస్తూ, సమాజంలోని అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. తమ సంఘం లేవనెత్తిన అంశాలను రేవంత్ సర్కార్ దృష్టికి తీసుకురావాలని విన్నవించారు. వాటి అమలుకు ప్రధాన ప్రతిపక్షం తరపున డిమాండ్లను సాధించేందుకు ప్రభుత్వంపైన ఒత్తిడి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదే అంశంపై జూన్ 15, 2026న జరిగిన అత్యవసర సర్వసభ్య సమావేశంలో తాము ఏకగ్రీవంగా తీర్మానం చేశామని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే జూన్ 17, 2026న హైకోర్టులో నిరసన ప్రదర్శన నిర్వహించామన్నారు. తమ న్యాయబద్ధమైన ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని, తెలంగాణ న్యాయవాదుల ప్రయోజనాలను కాపాడేలా సంబంధిత అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని కేటీఆర్ (KTR) ను కోరారు. కేటీఆర్ స్పందిస్తూ.. న్యాయవాదులు లేవనెత్తిన ప్రతి అంశం న్యాయమైందిని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే పార్టీగా తెలంగాణ న్యాయవాదులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Read Also: చిట్చాట్లో బాంబు పేల్చిన గుత్తా
Follow Us On: Instagram

