కలం, ఖమ్మం బ్యూరో : కొత్తగూడెం కార్పొరేషన్ (Kothagudem Municipal Corporation) లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నిన్నటి వరకూ సీపీఐకి (22), కాంగ్రెస్ కి (22) సమానంగా కార్పొరేషన్ సీట్లు ఉన్నాయి. దీంతో ఇరు పార్టీల పెద్దలు నిన్న రాత్రి పవర్ షేరింగ్ ఒప్పందం చేసుకున్నారు.. ఇంత వరకూ బాగానే ఉంది. సోమవారం సీపీఐ మేయర్ ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. కాబట్టి మేయర్ అభ్యర్ధిని సెలెక్ట్ చేసేశారు. రేపు అధికారికంగా మేయర్ ను ప్రకటించడమే మిగిలి ఉంది. అనుకుంటున్న తరుణంలో ఆదివారం ఉదయం రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఐదుగురు ఇండిపెండెంట్ కార్పొరేటర్లను కాంగ్రెస్ పార్టీలోకి స్వయంగా కండువాలు కప్పి మరీ ఆహ్వానించారు. దీంతో పవర్ షేరింగ్ ఒప్పందం తర్వాత, ప్రమాణ స్వీకారానికి ఒక్కరోజు ముందు ఇండిపెండెంట్ల ను కాంగ్రెస్ పార్టీ లో చేర్చుకోవాల్సిన అవసరం ఏముందనే ప్రశ్న సీపీఐ శ్రేణులతో పాటు రాజకీయ విశ్లేషకులను తొలిచి వేస్తుంది.
స్వతంత్రుల ఐదుగురి చేరికతో కాంగ్రెస్ బలం 27కు చేరింది. సీపీఎం సీటు, ఎక్స్ అఫిషియో ఓటు కలిస్తే కాంగ్రెస్ బలం 29 కి చేరుతుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ 31 కి కేవలం ఇద్దరు కార్పొరేట్ల అవసరం మాత్రమే ఉంటుంది. ఇక సీపీఐ విషయానికి వస్తే ఒక ఇండిపెండెంట్, ఒక ఎక్స్ అఫిషియో కలిపి 24 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అంటే మెజారిటీ కి ఇంకా ఏడు సీట్ల అవసరం ఉంటుంది. మొత్తం మీద కొత్తగూడెం (Kothagudem Municipal Corporation) పీఠం దక్కించుకోవడానికి ఇప్పటి వరకూ కాంగ్రెస్ కు ఇద్దరు కార్పొరేటర్ల అవసరం ఉండగా, సీపీఐకి ఏడుగురు అవసరం పడుతుంది. ఇంకా ప్రమాణ స్వీకారానికి కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. అంతా సవ్యంగా జరుగుతుందా లేదంటే ఉదయం వరకూ రాజకీయ సమీకరణాలు మారతయా అని వేచి చూడాల్సిందే.


