కలం, జగిత్యాల: కొండగట్టు వద్ద నిన్న ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ప్రమాద స్థలాన్ని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ (Jagtial SP Ashok Kumar) పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, రహదారి పరిస్థితి, వాహనాల కదలిక, వాహనాల వేగం తదితర అంశాలపై పోలీసు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అన్ని కోణాల్లో పరిశీలించి, సమగ్ర దర్యాప్తును వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని సూచించారు. ముఖ్యంగా ఓవర్టేక్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ముందున్న వాహనాలకు తగినంత దూరం పాటిస్తూ ప్రయాణించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ సూచించారు.

