కలం, వెబ్డెస్క్: మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని సాగర్ జిల్లాలో కల్తీ మద్యం తాగి తొమ్మది మంది మృతి చెందడం కలకలం రేపింది. బందా తహసీల్ పరిధిలోని రెండు గ్రామాల్లో శనివారం రాత్రి ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మృతులంతా బందాలోని బరాజ్ గ్రామానికి చెందిన వారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ అనురాగ్ సుజానియా పోలీసు బృందంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
కల్తీ మద్యం తాగి పలువురు అస్వస్థతకు గురయ్యారని, మరికొందరు ప్రాణాలు కోల్పోయారని జిల్లా కలెక్టర్ ప్రతిభా పాల్ వెల్లడించారు. అస్వస్థతకు గురైన మిగతా వారికి సివిల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. గత 24 నుంచి 48 గంటల్లో ఎవరైనా మద్యం సేవించి ఉంటే, లేదా ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

