కలం, నల్లగొండ బ్యూరో: రానున్న మూడేండ్లో 10 వేల ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Indlu) నిర్మించి ఇస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశామని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. బుధవారం నల్లగొండ పట్టణం 41వ డివిజన్లో ఇందిరమ్మ ఇల్లు పథకం కింద నిర్మించుకున్న ఇంటిని ఇంటి యజమానులు శ్రీనివాసరావు, పద్మ దంపతులచే గృహప్రవేశం చేయించారు. అనంతరం మంత్రి (Komatireddy Venkat Reddy) మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే మూడు సంవత్సరాల్లో పదివేల మందికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా తెలంగాణలో ప్రభుత్వం ఒక్కో గృహానికి రూ.5 లక్షలు మంజూరు చేస్తుండటం విశేషమన్నారు.
ఇతర రాష్ట్రాల్లో కేవలం రూ.1.70 లక్షల వరకు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. నల్గొండ పట్టణంలో ఇప్పటికే సుమారు 700 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామని, ఎల్ 2, ఎల్ 3 కేటగిరీలకు సంబంధించిన సమస్యలను క్యాబినెట్లో చర్చించి త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. నల్గొండ నియోజకవర్గానికి 10000 ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు. ఇంకా అవసరమైతే అదనంగా 5000 ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామన్నారు. పట్టణంలో దేవరకొండ రోడ్డు, నార్కట్పల్లి రోడ్డు, తిప్పర్తి రోడ్డు ప్రాంతాల్లో స్థలాలను పరిశీలిస్తున్నామని, అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత ఇందిరమ్మ కాలనీ నిర్మాణం చేపడతామని చెప్పారు.
గతంలో కలెక్టరేట్ వెనుక భాగంలో జర్నలిస్టులకు 8 ఎకరాల స్థలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్లో పరిశీలించామని గుర్తుచేశారు. త్వరలో కలెక్టర్తో మాట్లాడి అవసరమైతే సీఎం దృష్టికి తీసుకుపోయి జర్నలిస్టులకు ఇండ్లు కట్టించి ఇస్తామన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఓపిక పాటించాలని మంత్రి సూచించారు. మిల్లర్లు తేమ శాతం అధికంగా ఉందని ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో కొనుగోలు ప్రక్రియ కొంత ఆలస్యమైందని, ఇప్పటికే 50 శాతం ధాన్యం సేకరణ పూర్తయిందని తెలిపారు. మిగిలిన ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసేలా అధికారులతో, కలెక్టర్తో నిరంతరం సమీక్ష చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

