కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏమీ సాయం చేయడం లేదని, చివరకు వడ్ల కొనుగోళ్ళలోనూ చేతులెత్తేసిందంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) తప్పుపట్టారు. ఈ నెల 15న వడ్ల కొనుగోళ్ళు పూర్తికాగానే కేంద్రం సంగతి చూస్తానంటూ సీఎం చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా రియాక్షన్ ఇచ్చారు. పొలిమేరలు దాటనివ్వనంటూ తనను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ కామెంట్లు చేశారని, తన ఇంటి ముందు ధర్నా చేస్తానంటూ బెదిరిస్తున్నారని గుర్తుచేశారు. సీఎం రేవంత్రెడ్డి బెదిరింపులకు, తాటాకు చప్పుళ్ళకు భయపడడానికి తాను కేసీఆర్ను కాదని, బీజేపీ కార్యకర్తను అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. “నన్ను కూడా కేసీఆర్ అని మీరు అనుకుంటున్నారేమో.. కానీ కాదు.. నేను బీజేపీ కార్యకర్తను..” అని కామెంట్ చేశారు. బీజేపీ కార్యకర్తలు ఎవ్వరికీ లొంగరని, భయపడరని అన్నారు. వడ్లను కేంద్రం కొనకపోతే కిషన్రెడ్డి ఇంటి ముందు కుప్పగా పోసి ధర్నా చేయనున్నట్లు సీఎం హెచ్చరిస్తే భయపడేవాడిని కానన్నారు. ఇలాంటి ధర్నాలు, నిరసనలతోనే ఈ స్థాయికి వచ్చానని అన్నారు. హైదరబాద్లో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఈ నెల రోజుల్లోనే తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ. 28 వేల కోట్లను ఇచ్చిందని గుర్తుచేశారు.
రాహుల్గాంధీ ఈ జన్మలో ప్రధానమంత్రి కాలేరని కిషన్రెడ్డి వ్యాఖ్యనించారు. “రాసిపెట్టుకోండి.. ఈ జన్మలో రాహుల్గాంధీ ప్రధాని అయ్యే ప్రసక్తే లేదు..” అని రెట్టించి చెప్పారు. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద సున్న, గుండు సున్న సీట్లు వస్తున్నాయని, ఆ పార్టీ సత్తా ఏంటో ఈ ఫలితాలతో స్పష్టమవుతున్నదన్నారు. కేవలం రాహుల్గాంధీ తీరు కారణంగానే దేశ ప్రజల్లో ఆయన పట్ల వ్యతిరేకత పెరిగిందన్నారు. కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుందన్నారు. తెలంగాణలో రేవంత్రెడ్డికీ అదే జరుగుతుందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు కావడంలేదన్నారు. త్వరలోనే బీసీలు, దళితులు, మహిళలు ధర్నా చేస్తారని, అవసరమైతే ఢిల్లీలో రాహుల్ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తారని అన్నారు. హామీలు ఎందుకు అమలు చేయలేదో, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో, ఎన్ని నిధులు ఖర్చు చేశారో ప్రజలకు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు.

