కలం, వెబ్ డెస్క్: దేశాన్ని విభజించే వ్యాఖ్యలు చేయొద్దంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి సూచించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు. సదరు వేదికపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంపై వివక్ష చూపుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని, రాష్ట్రపతి అందరూ ఉత్తరాది వాళ్లేనన్నారు. ఢిల్లీలో సెకండ్ గ్రేడ్ సిటిజన్లుగా ఉండలేమని, పన్నులు కడుతూ ఇక్కడ గులాంగిరీ చేయలేమని చెప్పారు. ఈ వీడియోను కిరణ్ రిజిజు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి కూడా కిరణ్ పరోక్షంగా చురకలు అంటించారు. రేవంత్ రెడ్డి ఆయన నాయకుడి లాగే ఉన్నాడంటూ ఎద్దేవా చేశారు. దయచేసి దేశాన్ని విభజించడానికి ప్రయత్నించకండి అని, మనమందరం భారతీయులమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతి తూర్పు భారతదేశంలోని ఒడిశాకు చెందిన అంకితభావం గల గిరిజన నాయకురాలు అని, అలాగే ప్రధాని పశ్చిమ భారతదేశంలోని గుజరాత్లో జన్మించిన దూరదృష్టి, సద్గుణాలు గల నాయకుడు అని కొనియాడారు. ఉప రాష్ట్రపతి దక్షిణ భారతదేశంలోని తమిళనాడుకు చెందిన నిరాడంబరమైన వ్యక్తి అని గుర్తు చేశారు. అలాంటప్పుడు ప్రాంతాల వారీగా విభజన చేస్తూ విద్వేశాలు రెచ్చగొట్టొద్దని ఆయన కోరారు.

