కలం, వెబ్ డెస్క్: దేశంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక బొగ్గు రంగంలో కీలక సంస్కరణలు తెచ్చామని బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పష్టం చేశారు. నూతన భారత నిర్మాణంలో బొగ్గు రంగం (Coal Sector) కీలకపాత్ర పోషిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. 12 ఏళ్ల మోదీ పాలనలో ఒక్క అక్రమం జరగకుండా చర్యలు చేపట్టామని అన్నారు. ప్రపంచంలో బొగ్గు ఉత్పత్తి చేసే రెండో అతిపెద్ద దేశంగా భారత్ నిలిచిందని కొనియాడారు. బొగ్గు వినియోగంలోనూ చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉందని స్పష్టం చేశారు. బొగ్గు నిల్వలు ఉన్న దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉందని వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి కోల్ ఇండియా కంపెనీ అని.. ఈ కంపెనీ 426 గనుల్లో బొగ్గు ఉత్పత్తి చేస్తోందని అన్నారు. దేశ చరిత్రలో తొలిసారి బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో రికార్డు నమోదైనట్లు తెలిపారు.
కాంగ్రెస్ హయాంలో బొగ్గు ఉత్పత్తిలో అనేక స్కాములు జరిగాయని కిషన్ రెడ్డి మండిపడ్డారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కోల్ అంటే స్కామ్స్, అవినీతి, అనిశ్చితికి కేరాఫ్గా ఉండేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీఏ గవర్నమెంట్ లో బొగ్గు గనుల మంత్రి జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. రూ.1.89 లక్షల కోట్ల బొగ్గు కుంభకోణం జరిగిందని కాగ్ (CAG) నివేదిక ఇచ్చిందని కిషన్రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన కోల్ మైన్స్ను సుప్రీంకోర్టు రద్దు చేసిందని గుర్తు చేశారు.

