కలం, వెబ్ డెస్క్: ఉత్తర కొరియా (North Korea)లో ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) నేతృత్వంలోని వర్కర్స్ పార్టీ ఘన విజయం సాధించింది. మార్చి 15న జరిగిన ఈ ఎన్నికల్లో ఏకంగా 99.97 శాతం ఓట్లు సాధించి కిమ్ పార్టీ అన్ని స్థానాలను కైవసం చేసుకుంది. అధికారిక గణాంకాల ప్రకారం దేశంలోని ఓటర్లలో దాదాపు అందరూ ఓటింగ్లో పాల్గొన్నారు. అయితే ఈసారి ఫలితాల్లో కేవలం 0.07 శాతం మంది మాత్రం అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటు వేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా ఇలాంటి ఏకపక్ష ఎన్నికల్లో వ్యతిరేక ఓట్లు రావడం చాలా అరుదుగా భావిస్తారు.
ఎన్నికల ఫలితాల్లో కనిపించిన ఈ స్వల్ప వ్యతిరేకతపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆ 0.07 శాతం మంది పరిస్థితి ఏంటో? అంటూ కొందరు సరదాగా కామెంట్ చేస్తుంటే, ఆ ధైర్యవంతులు ఎవరో తెలుసుకోవాలని ఉందని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. త్వరలోనే ఆ దేశ జనాభా 0.07 శాతం తగ్గే అవకాశం ఉందంటూ నెటిజన్లు తమదైన శైలిలో జోకులు పేలుస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వారిలో కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ (Kim Jong Un) కూడా ఉన్నారు.
మరోవైపు ఈ ఎన్నికలు కేవలం బల ప్రదర్శన కోసమే జరిగాయని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి స్థానంలో కేవలం ఒకే అభ్యర్థి పోటీలో ఉండటం వల్ల ఓటర్లకు ఎంచుకునే అవకాశం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు 1957 తర్వాత తొలిసారి ఉత్తర కొరియా అధికారిక మీడియాలో వ్యతిరేక ఓట్లు పడ్డాయని ప్రకటించడం గమనార్హం.
Read Also: ఇరాన్ భూగర్భ సైనిక స్థావరాలపై అమెరికా దాడులు
Follow Us On: Instagram

