కలం, ఖమ్మం బ్యూరో: పెట్టుబడి లేకుండా రూ.లక్షలు సంపాదించవచ్చంటూ ఆన్లైన్ మోసాలకు (Online Course Scam) పాల్పడ్డాడంటూ ప్రముఖ యూట్యూబర్ బానోతు సాయినాథ్ (ఓకే సాయి) పై బాధితులు మంగళవారం ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. యూట్యూబ్ వేదికగా ‘ఓకే సాయి’ (బానోతు సాయినాథ్) అనే వ్యక్తి రకరకాల ఆన్లైన్ కోర్సులు, శిక్షణల పేరిట వీడియోలు చేస్తూ, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండానే భారీగా డబ్బులు సంపాదించవచ్చంటూ యువతను, అమాయకులను ఆకర్షించాడు. అతని మాటలు నమ్మి చేరిన వారి వద్ద నుంచి కోర్సుల ఫీజుల రూపంలో భారీగా డబ్బులు వసూలు చేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
తీరా డబ్బులు కట్టిన తర్వాత తమకు ఎలాంటి సంపాదన లేకపోగా, కట్టిన సొమ్ము కూడా తిరిగి ఇవ్వకుండా మోసగించాడని వారు వాపోయారు. ఆకర్షణీయమైన ప్రకటనలతో బురిడీ కొట్టించి, లక్షలాది రూపాయలు వసూలు చేశాడని, తమకు జరిగిన అన్యాయంపై సైబర్ క్రైమ్ విభాగంతోపాటు ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులతో లోతుగా దర్యాప్తు జరిపించాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితులు కారేపల్లి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తూ, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఆన్లైన్ మోసంపై దర్యాప్తు ప్రారంభించారు.

