కలం, వెబ్ డెస్క్: ఖమ్మం (Khammam) జిల్లా నేలకొండపల్లి మండలం బుర్హాన్పురం పరిధిలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. స్థానికంగా జర్నలిస్టుగా పని చేస్తున్న కొణతల రాముతో పాటు ఆయన ఐదేళ్ల కుమార్తె దివ్యనైనీ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతదేహాలతోనే భార్య రమ్య మూడు రోజుల పాటు ఇంట్లోనే గడపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నాలుగు రోజులుగా రాముకు ఫోన్లు వస్తున్నప్పటికీ.. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని చెబుతూ రమ్య అందరినీ నమ్మించింది. ఆదివారం సాయంత్రం ఇంటి నుండి విపరీతమైన దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన రమ్య సోదరుడు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. మంచం కింద రాము, కుమార్తె మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో కనిపించాయి. రమ్యతో పాటు చిన్న కూతురు దీక్ష అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన అధికారులు వెంటనే వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. తన భర్తను, పెద్ద కూతురిని రమ్యనే హతమార్చి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. చిన్న కూతురిని కూడా చంపేందుకు ప్రయత్నించి, విషయం బయటపడుతుందనే భయంతో ఆమె కూడా ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అసలు కారణాలను వెలికితీసేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.

