కలం, ఖమ్మం బ్యూరో: జనగణనే ప్రభుత్వ పథకాలకు ప్రాతిపదిక అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka )స్పష్టం చేశారు. సోమవారం ఖమ్మం లోని ప్రజా భవన్ క్యాంపు కార్యాలయంలో స్వీయ జనగణన కార్యక్రమంలో భాగంగా వెబ్సైట్ ద్వారా ఆయన తన వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనీ ప్రజలందరూ జనగణన లో భాగస్వాములు కావాలన్నారు. ప్రజలంతా తమ వివరాలను స్వయంగా ఆన్లైన్ లో నమోదు చేసుకుంటే సమాచార సేకరణ వేగంగా, సులభంగా పూర్తవుతుందని పేర్కొన్నారు.
తెలంగాణలో జనగణన 2027 ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయిందన్నారు. కాబట్టి ప్రతి కుటుంబం తమ వివరాలను కచ్చితంగా నమోదు చేసుకోవాలని తెలిపారు. అప్పుడే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు సక్రమంగా అందుతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ టీ ఎస్ దివాకర్, చీఫ్ ప్లానింగ్ అధికారి శ్రీనివాస్, టెక్నికల్ అసిస్టెంట్ హిమవర్ష తదితరులు పాల్గొన్నారు.

