కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ పసికందు బలైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. రక్తం ఎక్కించేందుకు వైద్య సిబ్బంది పసికందు చేతికి ఐవీ (IV) పెట్టిన సమయంలో జరిగిన నిర్లక్ష్యం కారణంగా ఇన్ఫెక్షన్ ఏర్పడి, అది క్రమంగా తీవ్ర స్థాయికి చేరింది. రోజురోజుకూ ఇన్ఫెక్షన్ చేతి మొత్తం వ్యాపించడంతో పరిస్థితి విషమించింది. చివరికి బాబును ఖమ్మం నుంచి నిలోఫర్ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు అతని ప్రాణాలను కాపాడేందుకు ఎడమ చేయిని భుజం వరకు తొలగించాల్సి వచ్చింది. పుట్టిన కొద్ది రోజులకే పసికందు ఇలా అంగవైకల్యానికి గురవ్వడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.
ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) తీవ్రంగా స్పందించింది. కేసును సుమోటోగా స్వీకరించిన కమిషన్, ఘటనపై తక్షణమే సమగ్ర దర్యాప్తు జరపాలని జిల్లా వైద్యాధికారికి (DMHO) నోటీసులు జారీ చేసింది. ఆసుపత్రిలో అసలు ఏం జరిగింది?, ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ దారుణం చోటుచేసుకుందీ? అనే అంశాలపై పూర్తి వివరాలతో జూన్ 29లోగా నివేదిక సమర్పించాలని హెచ్ఆర్సీ ఆదేశించింది. ఇక ఈ ఘటనకు బాధ్యులైన వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

