కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) జిల్లా కొణిజర్ల మండలంలోని మొక్క జొన్న రైతులు కొనుగోలు కేంద్రాలు పెంచాలంటూ శనివారం ఖమ్మం, వైరా జాతీయ రహదారిపై నిరసన ప్రదర్శన చేపట్టారు. కొణిజర్ల మండలంలో సుమారు 25 వేల ఎకరాల్లో రైతులు మొక్క జొన్న పంట వేశారు. పంట కోసిన రైతులు మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా పంటను అమ్ముతున్నారు. అయితే మండలంలోని 27 గ్రామ పంచాయతీలకు ఒకే కొనుగోలు కేంద్రం ఉండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కొనుగోలు కేంద్రాల వద్ద సిబ్బంది సరిపోను లేకపోవడంతో కొనుగోళ్లలో తీవ్రమైన జాప్యం జరుగుతుందని, ఫలితంగా రోజుల తరబడి పంటకు కాపలా కాయల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని రైతులందరికీ ఒకేసారి పంట చేతికి రావడంతో, అమ్ముకోవడానికి అందరూ కొనుగోలు కేంద్రాల బాట పట్టడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైతులు పేర్కొన్నారు. కాబట్టి రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు కలగ చేసుకుని సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ధర్నా సమాచారం అందుకున్న అధికారులు తక్షణమే స్పందించి రైతులతో మాట్లాడి కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు తాత్కాలికంగా నిరసన విరమించినప్పటికీ, సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన తీవ్రతరం చేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేయడం గమనార్హం.

