కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లాలో పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరతపై నిఘా ఉందని, ప్రజలు ఆందోళన చెందవద్దని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ (Khammam CP Sunil Dutt) తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఉన్నా.. లేదని నిరాకరించినా, లేదా అధిక ధరలకు విక్రయించినా, వెంటనే స్థానిక పౌరసరఫరాల అధికారులకు లేదా పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
జిల్లాలో పెట్రోల్, డీజిల్ స్టాక్ విషయంలో భయపడాల్సిన పనిలేదని, ఎవరూ అపోహలు నమ్మి పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకోవద్దని.. అవసరమైన మేరకే కొనుగోలు చేయాలని సూచించారు. ఇంధన సరఫరాలో అంతరాయం కలగకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు.

