కలం, ఖమ్మం బ్యూరో: ఇంటి బయట ఆడుకుంటున్న ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, 50 వేల రూపాయల జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు (Khammam Court) న్యాయమూర్తి శ్రీనివాసరావు బుధవారం సంచలన తీర్పు వెల్లడించారు. ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.
2023 మే 28వ తేదీన ఖమ్మం జిల్లాకు చెందిన బోయినపల్లి వీరబాబు (40) అనే వ్యక్తి, తన ఇంటి పక్కనే ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని మాయమాటలతో లోబరుచుకున్నాడు. బాలికను బలవంతంగా తన ఇంట్లోకి తీసుకెళ్లి, ఎవరికీ వినిపించకుండా టీవీ సౌండ్ ఎక్కువగా పెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 279/2023 గా కేసు నమోదైంది. పోలీసులు నిందితుడిపై IPC సెక్షన్లు 323, 354 (A)(B), 506 తో పాటు సెక్షన్ 8 (పోక్సో చట్టం-2012) కింద కేసు నమోదు చేశారు.
అనంతరం విచారణను వేగవంతం చేసి, పక్కా సాక్ష్యాధారాలతో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టు విచారణలో భాగంగా ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలు, వైద్య నివేదికలను పరిశీలించిన న్యాయమూర్తి బీ శ్రీనివాసరావు, నిందితుడిపై మోపబడిన నేరం రుజువు కావడంతో అతనికి ఏడేళ్ల కఠిన జైలు శిక్ష, రూ.50,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శరత్ కుమార్ రెడ్డి గట్టిగా వాదనలు వినిపించడం గమనార్హం.

