కలం/ఖమ్మం బ్యూరో : ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోనీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అపరిశుభ్రతపై కలెక్టర్ (Khammam Collector) అనుదీప్ సీరియస్ అయ్యారు. 200 మంది పారిశుధ్య సిబ్బంది ఉన్నప్పటికీ ఆస్పత్రి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్చి 15 వరకు చేపట్టే ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ లో ఆసుపత్రిలో స్పష్టమైన మార్పు కనిపించాలన్నారు. ఆదివారం ఖమ్మం జనరల్ ఆసుపత్రిలోని పారిశుధ్య నిర్వహణను 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిశీలించారు. ఆస్పత్రి సమీపంలో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ బిల్డింగ్ పనులను, పార్కింగ్ స్థలం, పరిసరాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో ఆస్పత్రి ప్రాంగణంలో ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ఆస్పత్రి ఆవరణలో నిర్మించనున్న రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలన్నారు. ఆస్పత్రిలో అవసరమైన టాయిలెట్స్ నిర్మాణ పనులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఆర్ ఎంవోలు ఆస్పత్రి నిర్వహణపై స్పెషల్ కేర్ తీసుకోవాలని.. సిబ్బంది హాజరు, రోగులకు మెరుగైన వైద్య సేవలపై ఎప్పటికప్పుడు పరిశీలించాన్నారు. ఆస్పత్రి వద్ద పార్కింగ్ సక్రమంగా నిర్వహించేందుకు ఒక ఏజెన్సీనీ గుర్తించి బాధ్యతలు అప్పగించాలని తెలిపారు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆస్పత్రిలో పనికి రాని పాత ఫర్నీచర్, ఇతర పరికరాలు పూర్తి స్థాయిలో తొలగించాలని కలెక్టర్ (Khammam Collector) ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడా చెత్త ఉండటానికి వీల్లేదని హెచ్చరించారు.
Read Also: విమెన్స్ డే స్పెషల్ : బ్రిలియంట్ ఆఫీసర్.. సైలెంట్ ఆపరేషన్
Follow Us On : WhatsApp

