కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) నగరంలోని మున్నేరు నది (Munneru River) పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ (Divakara T S) అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల కోసం అవసరమైన భూసేకరణను వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. గురువారం కలెక్టర్ ఖమ్మం నగరంలో విస్తృతంగా పర్యటించి, మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు, కాల్వొడ్డు తీగల వంతెన పనులు, భూ నిర్వాసితుల కోసం ఏర్పాటు చేస్తున్న లేఔట్ వెంచర్ అభివృద్ధి పనులను ఆకస్మిక తనిఖీ చేశారు. అలాగే రాజీవ్ గృహకల్ప, రంగనాయక గుట్ట, ప్రకాష్ నగర్ చెక్ డ్యాంలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిపుణుల కమిటీ రూపొందించిన డిజైన్ ప్రకారం రిటైనింగ్ వాల్ నిర్మాణం పక్కాగా జరగాలని స్పష్టం చేశారు. పనులు సకాలంలో పూర్తి అయ్యేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రింద సేకరించిన భూములను అభివృద్ధి చేసి, మున్నేరు నది (Munneru River) రిటైనింగ్ వాల్ భూ నిర్వాసితులకు అందించేలా రైతులతో చర్చలు జరపాలని తెలిపారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి స్థాయిలో నిర్మించాలని, రెండు వైపుల నుంచి ప్రణాళికాబద్ధంగా పనులు జరగాలని అన్నారు.
బైపాస్ నుంచి తీగల వంతెన వరకు మున్నేరు రిటైనింగ్ వాల్ ఎడమ, కుడి వైపుల పనులు పూర్తవ్వాలని, చిన్న, చిన్న గ్యాప్లు కూడా ఉండకూడదని స్పష్టం చేశారు. మున్నేరు నది అభివృద్ధి కోసం అవసరమైన భూముల సేకరణను ప్రాధాన్యతగా పూర్తి చేయాలని, నిర్వాసితులకు ప్రత్యామ్నాయ భూములు అందించే లేఔట్ వెంచర్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. వెంచర్కు రహదారులు, అంతర్గత రోడ్లు అభివృద్ధి చేస్తే భూముల విలువ పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఆర్&బీ ఎస్ఈ యాకుబ్, ఇరిగేషన్ డీఈ రమేష్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read Also: తెలంగాణ కాంగ్రెస్ కి బీసీ లీడర్ల ప్రెజర్..!
Follow Us On: Sharechat

