కలం, ఖమ్మం బ్యూరో : మహిళా దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా మహిళలకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి (Anudeep Durishetty) శుభవార్త చెప్పారు. మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం టీకా అందుబాటులోకి వచ్చిందని ఆయన తెలిపారు. ఆదివారం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్పీవీ వాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కౌమార బాలికలకు హెచ్పీవీ టీకా అందించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే గర్భాశయ క్యాన్సర్ను కట్టడి చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఒకే మోతాదులో ఇచ్చే ఈ టీకా గర్భాశయ క్యాన్సర్ నుండి రక్షణ కల్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని వివరించారు. ఈ టీకా పూర్తిగా సురక్షితమైనదని, జిల్లాలోని బాలికలకు తల్లిదండ్రుల ఆమోదంతో ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా అందజేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. టీకా వల్ల కలిగే ప్రయోజనాలను తల్లిదండ్రులకు వివరించి, అధిక సంఖ్యలో బాలికలకు టీకా అందేలా చూడాలని ఆయన వైద్య అధికారులను ఆదేశించారు.

