కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) జిల్లాలో ‘మన సమాచారం – మన భవిష్యత్తు’ అనే నినాదంతో నిర్వహిస్తున్న జనగణన ప్రక్రియపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ర్యాలీ (Census Awareness Rally) నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి (Srinivas Reddy) జెండా ఊపి ప్రారంభించారు. ఖమ్మం సర్ధార్ పటేల్ స్టేడియం నుంచి జడ్పీ సెంటర్ వరకు జరిగిన ఈ ర్యాలీలో క్రీడాకారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ స్వయంగా ర్యాలీలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనగణనలో భాగంగా ప్రజలు తమ వివరాలను తామే నమోదు చేసుకునే ‘స్వీయ గణన’ విధానం ఈ నెల 10వ తేదీతో ముగియనుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని నమోదు శాతాన్ని పెంచాలని కోరారు.
మే 11 నుంచి ఎన్యుమరేటర్లు నేరుగా ఇళ్లకు వచ్చి వివరాలు సేకరిస్తారని ఆయన వెల్లడించారు. మొత్తం 34 ప్రశ్నలు అడుగుతారని, ప్రజల వ్యక్తిగత సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని స్పష్టం చేశారు. సందేహాల నివృత్తి కోసం ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సరైన గణాంకాల ఆధారంగానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు చేరుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి పౌరుడు ఈ ప్రక్రియలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీవో శ్రీనివాస్, డీఎస్డీవో సునీల్ రెడ్డి, ఎస్ఓ శ్రీధర్, మున్సిపల్ అధికారులు అనిల్ కుమార్, శ్రీనివాసరావుతో పాటు పలు శాఖల అధికారులు, విద్యార్థులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు.

