కలం, వెబ్ డెస్క్: తెలంగాణ వాదులు కలలు గన్న రాష్ట్రాన్ని తమ పార్టీ సాధిస్తుందని తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha) స్పష్టం చేశారు. ఈ నెల 25న కవిత పార్టీని ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ముందుగానే కవిత పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. అన్ని జిల్లాల నుంచి తమ పార్టీకి వస్తున్న స్పందనపై కవిత సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు, నాయకులు భారీగా తమ పార్టీలో చేరుతున్నారన్నారు. తమ పార్టీ తప్పకుండా ప్రజలకు మేలు చేస్తుందన్న నమ్మకంతో అందరూ అన్ని జిల్లాల నుంచి తరలివస్తున్నారన్నారు. ముందు పాత పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నామని, కానీ భారీగా జనం తరలివస్తున్నారని చెప్పారు. ఎండల నేపథ్యంలో మీటింగ్కు వచ్చే వాళ్లు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
జాగృతి అస్తిత్వమే తెలంగాణ అని, తెలంగాణ అనే పేరు లేకుండా, తెలంగాణ వాదం అనేది లేకుండా రాజకీయం లేదని, ప్రజలకు ఏ మేలు జరగదని కవిత చెప్పారు. తమ పార్టీ పూర్తి రీజనల్ పార్టీ అని, ముందు తెలంగాణ పల్లెలు వెలిగిన తర్వాత పక్క రాష్ట్రాల గురించి ఆలోచిస్తామన్నారు. ప్రజలు మెచ్చే విధంగా తమ పార్టీ ఉండబోతోందని స్పష్టం చేశారు. ఇక పార్టీ పేరు, గుర్తింపునకు సంబంధించిన సమస్యలు ఏమీ లేవని, తమ పార్టీలో చాలా మంది లాయర్లు ఉన్నారని, అన్నింటినీ ఎదుర్కొంటామని కవిత అన్నారు. జాగృతి ఎప్పుడూ స్వతంత్రంగానే ఉందని, ఎప్పుడూ బీఆర్ఎస్ వింగ్గా లేదని స్పష్టం చేశారు. 25న తమ పార్టీ ఎజెండా ప్రకటిస్తామని, మూడు పార్టీలతో చేయబోయే యుద్ధంపై స్పష్టత వస్తుందని చెప్పారు.

