కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha ) జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో పర్యటించారు. కవిత సమక్షంలో డాక్టర్ రఘుతో సహా పలువురు టీఆర్ఎస్లో చేరారు. సత్తక్కపల్లి గ్రామ శివారులో తెలంగాణ తల్లికి, అంబెడ్కర్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కవిత పలుచోట్ల జెండా ఆవిష్కరణ చేశారు. నిరుద్యోగ అంశంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని ఆరోపించారు.
ఆ రెండు పార్టీలు గత చరిత్రపైనే రాజకీయాలు చేస్తూ, ప్రస్తుత సమస్యలను విస్మరిస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగ యువతకు రెండు పార్టీలు అన్యాయం చేశాయని మండిపడ్డారు. కానిస్టేబుల్ నియామకాల్లో 20 వేల పోస్టులు భర్తీ చేయాలని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 6 వేల పోస్టులకే పరిమితమయిందన్నారు. ప్రతి జిల్లాకు, ప్రతి నియోజకవర్గానికి తగిన ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదని.. యువతను తప్పుదోవ పట్టిస్తున్న పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్పాలని కోరారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతకు తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని కవిత స్పష్టం చేశారు.

