కలం, నిజామాబాద్ బ్యూరో: ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) అమెండ్మెంట్ బిల్ -2026 (FCRA)పై ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీ జాయింట్ కమిటీ సభ్యుడుగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం లోక్సభ విడుదల చేసిన అధికారిక బులెటిన్లో జాయింట్ కమిటీ సభ్యుల జాబితాలో అర్వింద్ ధర్మపురి పేరు నమోదైంది. ఈ కమిటీలో లోక్సభ, రాజ్యసభకు చెందిన మొత్తం 31 మంది సభ్యులు ఉన్నారు.
ఈ సందర్భంగా అర్వింద్ ధర్మపురి (Arvind Dharmapuri) మాట్లాడుతూ.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కీలకమైన బాధ్యతను నిర్వర్తించే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాలకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రయోజనాలు, జాతీయ భద్రత, పారదర్శకత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని బిల్లుపై జాయింట్ కమిటీలో సమగ్రంగా చర్చించి, తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని అర్వింద్ తెలిపారు. నిజామాబాద్ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, పార్లమెంటులో ప్రజా సమస్యలతో పాటు దేశ ప్రయోజనాలకు సంబంధించిన ప్రతి అంశంపై మరింత బాధ్యతతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.

