కలం, ఖమ్మం బ్యూరో: వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) సోమవారం రాత్రి నిరాహార దీక్షకు దిగారు. ఖమ్మంలోని అంబేద్కర్ భవన్లో వెలుగుమట్ల నిర్వాసితులతో కలసి నిరవధిక నిరాహార దీక్షలో కూర్చున్నారు. బాధితులు ఎక్కడ ఇండ్లు పోగొట్టుకున్నారో, అక్కడే వాళ్లకు స్థలం ఇచ్చి, ఇండ్లు కట్టించాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు దీక్ష విరమించనని ప్రతిన బూనారు. దీంతో ఖమ్మంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కాగా, అంతకు ముందు ఉదయం వెలుగుమట్ల నిర్వాసితులను పరామర్శించడానికి కవిత (Kavitha) ఖమ్మం చేరుకున్నారు. అనంతరం బాధితులతో కలసి జెడ్పీ సెంటర్లో ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా పోలీసులు లేకుండా తనను అరెస్ట్ చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదల అయిన తరవాత నేరుగా అంబేద్కర్ భవన్కు చేరుకున్నారు. బాధితులతో పాటు నిరవధిక నిరహార దీక్ష ప్రారంభించారు.

