కలం, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam Case)లో తాను అరెస్ట్ అయినట్లు వస్తున్న వార్తలను మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు (Karumuri Nageswara Rao) ఖండించారు. ఈ మేరకు ఆయన స్వయంగా మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను తణుకులోని తన నివాసంలో ఉన్నట్లు కారుమూరి వెల్లడించారు. తాను పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నట్లు తెలిపారు. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. తనపై కావాలనే కొన్ని టీవీ ఛానెళ్లు కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వం మొత్తం అబద్ధాల మీదనే నడుస్తోందని, తాను బీసీ అయినందునే తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేసి పరువు నష్టం కలిగించేలా చేస్తున్నారన్నారు. ప్రజలు అవేవీ నమ్మవద్దని కోరారు.
కాగా, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు ఉదయం రాజ్ కేసిరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో మరికొంత మంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటూ వార్తలు వచచాయి. అంతలోనే కారుమూరి నాగేశ్వర్ రావును ఈడీ అదుపులోకి తీసుకుందంటూ కొన్ని టీవీ చానెళ్లు, సోషల్ మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి. దీంతో కారుమూరి ఓ ప్రత్యేక వీడియో రిలీజ్ చేసి ఆయన అరెస్ట్ కాలేదంటూ ప్రజలకు క్లారిటీ ఇచ్చారు.

