కలం, వెబ్ డెస్క్: కర్ణాటక (Karnataka) గవర్నర్ సంచలన థావర్ చంద్ గహ్లోత్ నిర్ణయం తీసుకున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ శివశంకరప్ప సాహుకర్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. నిబంధనలకు విరుద్ధంగా తన ఇద్దరు కుమార్తెలకు అక్రమంగా ఉద్యోగాలు ఇప్పించుకున్నారని తేలడంతో ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఛైర్మన్ వ్యవహారంపై విచారణ జరిపించాలని రాష్ట్రపతికి సిఫార్సు చేశారు. విచారణ పూర్తయ్యే వరకు.. కమిషన్ సభ్యుల్లో సీనియర్ ఛైర్మన్గా వ్యవహరించాలని ఆదేశించారు.
అసలేం జరిగిందంటే..
కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇండస్ట్రియల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల నియామకానికి పరీక్షలు పూర్తి చేసి, ఫలితాలు కూడా విడుదల చేసింది. దీనిలో కమిషన్ ఛైర్మన్ శివశంకరప్ప సాహుకర్ ఇద్దరు కుమార్తెలు అక్రమ పద్ధతిలో ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి.
మొదటగా వారు దరఖాస్తు చేసుకునే సమయంలోనే తమ తండ్రి కమిషన్ ఛైర్మన్ అని స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. కానీ అలా చేయలేదు. రెండోది, తమ కుటుంబ వార్షికాదాయం కేవలం రూ.40 వేలు అంటూ తప్పుగా చూయించారు. మూడోది, ఓబీసీ క్రిమిలేయర్ మినహాయింపు కింద ప్రయోజనాలు పొందారని లోక్ భవన్ ఒక ప్రకటనలో తెలిపింది.
గవర్నర్ ఉత్తర్వుల్లో ఏముందంటే..
కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ (KPSC Chairman) ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ ప్రకటించకుండానే నియామక ప్రక్రియను కొనసాగించినట్లు గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ పిల్లలు బీసీ రిజర్వేషన్ ప్రయోజనాలు పొందేందుకు అర్హులు కారు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తూ, తప్పుడు వివరాలతో ప్రయోజనం పొందినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
సాహుకర్ సమర్పించిన ఆదాయం, ఆస్తుల వివరాలు, ఇతర అధికారిక రికార్డులను పరిశీలించిన తర్వాత ఆర్టికల్ 317(1) ప్రకారం చర్యలు తీసుకోడానికి తగిన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని గవర్నర్ భావించారు. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు విచారణకు అప్పగించాలంటూ రాష్ట్రపతికి రాసిన లేఖలో సిఫార్సు చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ విశ్వసనీయత, పారదర్శకతను కాపాడేందుకు, విచారణపై ప్రభావం పడకుండా ఉండేందుకు ఛైర్మన్ సస్పెన్షన్ నిర్ణయం తప్పనిసరి అయింది’ గవర్నర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
,Read Also: అమీర్ ఖాన్ 3వ పెళ్లి.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
Follow Us On: Instagram

