కలం, వెబ్ డెస్క్: శ్రీశైలం (Srisailam) మల్లన్న కోసం భక్తులు రకరకాలుగా తమ మొక్కులు చెల్లించుకుంటారు. కర్ణాటకకు చెందిన వెంకటేశ్ అనే యువకుడు వినూత్నంగా మొక్కు చెల్లించుకుంటున్నాడు. కర్ణాటకలోని నందిని ప్రాంతం నుంచి శ్రీశైలం క్షేత్రం వరకు పాదయాత్ర చేయాలని సంకల్పించుకున్నాడు. సాధారణంగా చాలామంది భక్తులు నడక ద్వారా శ్రీశైలం చేరుకొని మల్లన్నకు మొక్కులు చెల్లించుకుంటారు. కానీ వెంకటేష్ మాత్రం తన కాళ్లకు సుమారు 4 అడుగుల ఎత్తు ఉన్న చెక్క కట్టెలను (Wooden Stilts) కట్టుకుని వాటిపై బ్యాలెన్సింగ్ చేస్తూ, కిలోమీటర్ల కొద్దీ నడుస్తున్నాడు.
సుదూర ప్రాంతం నుంచి వస్తున్న ఈ యువకుడిని చూసేందుకు స్థానికులు, భక్తులు ఆసక్తి చూపుతున్నారు. ఎంతో ఏకాగ్రత, శారీరక శ్రమతో కూడిన ఈ ప్రక్రియలో ఎక్కడా పట్టు తప్పకుండా నాలుగు అడుగుల ఎత్తులో నడుస్తూ వెళ్లడం విశేషం. మల్లన్నపై ఉన్న అచంచలమైన విశ్వాసంతోనే తాను ఈ సాహస యాత్ర చేస్తున్నానని అంటున్నాడు. శ్రీశైలం (Srisailam) చేరుకునే వరకు ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతానని వెంకటేశ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ యువకుడి పాదయాత్రకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also: ఆరు గ్యారంటీలపై కేటీఆర్ ఒత్తిడి.. అసెంబ్లీలో కీలక బిల్లులు
Follow Us On: Sharechat

