కలం, వెబ్ డెస్క్ : కరీంనగర్ (Karimnagar) జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురుని ప్రేమించి పెళ్లి చేసుకున్న అల్లుడే అత్త ప్రాణాలు తీసిన ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్కు చెందిన స్నేహిత్(28) అనే యువకుడు కావ్య అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే ఏప్రిల్ 29న అత్త అరుణను తన ద్విచక్ర వాహనంపై బయటకు తీసుకెళ్లిన స్నేహిత్ దారి మధ్యలో ఘాతుకానికి ఒడిగట్టాడు.
బండి వెనుక కూర్చున్న అత్తను తన వద్ద ఉన్న హెల్మెట్తో తలపై బలంగా బాదాడు. ఈ దాడి ధాటికి ఆమె వాహనం పైనుంచి కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. ఈ క్రమంలో ఆమెకు ఫిట్స్ రావడం వల్లే కింద పడిపోయిందని అందరినీ నమ్మించేందుకు నిందితుడు ప్రయత్నించాడు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులకు అసలు నిజం తెలిసింది. హెల్మెట్తో కొట్టిన దృశ్యాలు స్పష్టంగా కనిపించడంతో స్నేహిత్ అసలు రంగు బయటపడింది. నిందితుడిపై భార్య కావ్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

