కలం వెబ్ డెస్క్: పంజాబ్ కింగ్ పంచాలను గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) విరిచేశారు. బ్యాటింగ్, బౌలింగ్ అనే తేడా లేకుండా అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది గుజరాత్. పంజాబ్పై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జేసన్ హోల్డర్ బంతితో నిప్పులు చెరిగితే, సాయి సుదర్శన్ తన క్లాస్ బ్యాటింగ్తో గుజరాత్ విజయాన్ని సులువు చేశాడు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. మహమ్మద్ సిరాజ్, రబడ ధాటికి టాప్ ఆర్డర్ పేకమేడలా కూలింది. ప్రియాన్ష్ ఆర్య (2), ప్రభ్సిమ్రన్ (15), కానోలీ (0) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (19) కాసేపు క్రీజులో నిలబడటానికి ప్రయత్నించినా, హోల్డర్ అతన్ని క్లీన్ బౌల్డ్ చేసి పంజాబ్ నడ్డి విరిచాడు. ఒకానొక దశలో 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును సూర్యాన్ష్ షెడ్జ్ (57; 29 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆదుకున్నాడు. అతనికి మార్కస్ స్టోయినిస్ (40) తోడవడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 4 వికెట్లతో చెలరేగగా, సిరాజ్, రబడ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్కు ఓపెనర్ సాయి సుదర్శన్ (57; 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ (5) త్వరగా అవుటైనా, జోస్ బట్లర్ (26) తో కలిసి సుదర్శన్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. మధ్యలో పంజాబ్ బౌలర్లు వైశాఖ్, అర్ష్దీప్ సింగ్ వరుస వికెట్లు తీసి ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినా, వాషింగ్టన్ సుందర్ (40 నాటౌట్; 23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యతాయుతమైన ఆట తీరుతో మ్యాచ్ను గెలిపించాడు.
ముఖ్యంగా చివర్లో అర్షద్ ఖాన్ (8 నాటౌట్) తో కలిసి సుందర్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ, 19.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకునేలా చేశాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్, వైశాఖ్ చెరో రెండు వికెట్లు తీసినా ఫలితం లేకుండా పోయింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది.

