కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ III టౌన్ పోలీస్ స్టేషన్ (Karimnagar Police) పరిధిలో పోగొట్టుకున్న 7 మొబైల్ ఫోన్లను CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా బాధితులు నమోదు చేసిన ఫిర్యాదుల ఆధారంగా గుర్తించి, ట్రేస్ చేసి, వాటిని వారి యథార్థ యజమానులకు ఈరోజు అప్పగించినట్లు కరీంనగర్ III టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ జి. తిరుమల తెలిపారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే CEIR పోర్టల్లో లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేయాలని ఆయన సూచించారు. ఫిర్యాదు నమోదు చేసినట్లయితే పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం, ట్రేస్ చేయడం మరియు తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని తెలిపారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ శ్రీ జి. తిరుమల సైబర్ అవగాహనపై మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న తర్వాత దానిలో ఉన్న వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ యాప్స్, సిమ్ కార్డు, సోషల్ మీడియా ఖాతాలు, OTPలు , ఇతర సున్నితమైన వివరాలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సంబంధిత సిమ్ కార్డును బ్లాక్ చేయించుకోవడం, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పాస్వర్డ్లు మార్చుకోవడం, అలాగే పోలీసులకు మరియు CEIR పోర్టల్లో వెంటనే ఫిర్యాదు చేయడం అత్యంత అవసరమని సూచించారు.
అదేవిధంగా ప్రజలు తమ మొబైల్ ఫోన్లలో బలమైన పాస్వర్డ్ లు, స్క్రీన్ లాక్లు, బయోమెట్రిక్ భద్రతా విధానాలను ఉపయోగించాలని, అపరిచిత లింకులు, సందేశాలు, కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సైబర్ మోసాలకు గురైనట్లయితే వెంటనే 1930 సైబర్ హెల్ప్లైన్ నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించడంలో కృషి చేసిన పోలీసు సిబ్బందిని ఇన్స్పెక్టర్ అభినందించారు. తమ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు తిరిగి లభించినందుకు బాధితులు కరీంనగర్ III టౌన్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

