కలం, వెబ్ డెస్క్ : భారత మహిళల హాకీ (indian Womens Hockey) జట్టులో మరో చరిత్ర సృష్టించబడింది. స్టార్ మిడ్ఫీల్డర్ నేహా గోయల్ (Neha Goyal) దేశం తరఫున 200 అంతర్జాతీయ మ్యాచ్లు పూర్తి చేసి అరుదైన మైలురాయిని అందుకుంది. మహిళల నేషన్స్ కప్లో ఉరుగ్వేతో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించడం ప్రత్యేకంగా నిలిచింది. హర్యానాకు చెందిన నేహా, ఒలింపిక్స్లో నాలుగో స్థానం సాధించడం నుంచి ఏషియన్ గేమ్స్లో పతకాలు గెలవడం వరకు తన ప్రతిభను చాటుకుంది. ఈ సందర్భంగా దిలీప్ టిర్కీ, భోలానాథ్ సింగ్ ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని, తన విజయానికి కుటుంబం, హాకీ ఇండియా మద్దతే కారణమని నేహా తెలిపింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే, భారత జట్టు అద్భుత ప్రదర్శనతో 3-2 తేడాతో ఉరుగ్వేపై విజయం సాధించింది. ప్రారంభంలో వెనుకబడినా, టీమిండియా అమ్మాయిలు పోరాట స్పూర్తి చూపించారు. దీపికా కుమారి రెండు గోల్స్తో జట్టును ముందుకు నడిపించగా, దీపికా సోరెంగ్ కీలక గోల్ సాధించి విజయాన్ని ఖాయం చేసింది. ఈ విజయంతో భారత్ పూల్-Aలో యూఎస్ఏ, జపాన్, ఉరుగ్వేలను వరుసగా ఓడించి క్లీన్ స్వీప్ చేసింది. టాప్ ప్లేస్తో సెమీఫైనల్కు దూసుకెళ్లిన భారత జట్టు ప్రస్తుతం ఫుల్ ఫామ్లో ఉంది. దీంతో టైటిల్పై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

