కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మహిళా మున్సిపల్ కార్మికురాలిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ సోషల్ మీడియా, కొన్ని పత్రికల్లో వస్తున్న వార్తలు/వదంతుల్లో ఎలాంటి వాస్తవం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ విషయమై సప్తగిరి కాలనీ, కరీంనగర్కు చెందిన రాయనవేణి లక్ష్మి (52) స్వచ్ఛందంగా తన స్టేట్మెంట్ను విడుదల చేశారు. బాధిత మహిళ తన స్టేట్మెంట్లో తెలిపిన వివరాల ప్రకారం ఆమె పని చేసే ఇంటి యజమానురాలు మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ సువార్త బంగారం పోయిందని ఫిర్యాదు చేయడంతో, విచారణ నిమిత్తం పోలీసులు లక్ష్మిని పిలిచారు.
స్టేషన్కు వెళ్లిన లక్ష్మిని పోలీసులు కేవలం విచారించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు తప్ప… ఆమెను కొట్టడం కానీ, తిట్టడం కానీ చేయలేదు. అయితే, తమపై ఎక్కడ కేసు అవుతుందో అనే భయంతో, స్థానిక విలేకరి అడిగినప్పుడు భయపడి పొరపాటున పోలీసులపై తప్పుడు సమాచారం ఇచ్చామని ఆమె అంగీకరించారు. విలేకరి పేపర్లో ఏం రాశారో కూడా తనకు తెలియదని ఆమె పేర్కొన్నారు. కాగా శనివారం ఉదయం ఫిర్యాదుదారులైన అడిషనల్ కమిషనర్ సువార్తను లక్ష్మి కలవగా… తనకు పోయిన బంగారు ఆభరణం దొరికిందని, పోలీసు కంప్లైంట్ వెనక్కి తీసుకుంటానని ఆమె తెలిపినట్లు లక్ష్మి స్పష్టం చేశారు. కాబట్టి, పోలీసు స్టేషన్లో మహిళపై థర్డ్ డిగ్రీ జరిగిందంటూ వస్తున్న వార్తలన్నీ కేవలం వదంతులేనని, ప్రజలు, మీడియా ప్రతినిధులు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని పోలీసులు కోరారు.

