కలం, కరీంనగర్ బ్యూరో : రానున్న బక్రీద్ పండగను పురస్కరించుకుని పశువుల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం (CP Gaush Alam) సోమవారం కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ చెక్ పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరీంనగర్ రూరల్ డివిజన్ పరిధిలోని కొత్తపల్లి మండలం చింతకుంట, గంగాధర మండలం తుర్కాసినగర్, చొప్పదండి మండలంలోని ఆర్నకొండ వద్ద ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా చెక్ పోస్టులను సీపీ (CP Gaush Alam) స్వయంగా సందర్శించి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
తనిఖీల్లో భాగంగా సీపీ గౌష్ ఆలం కింది అంశాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. చెక్ పోస్టుల గుండా వెళ్లే ప్రతి అనుమానాస్పద వాహనాన్ని, ముఖ్యంగా రవాణా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. చట్టవ్యతిరేకంగా పశువులను తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చెక్ పోస్టులలో నిర్వహిస్తున్న తనిఖీ రిజిస్టర్లను నిశితంగా పరిశీలించి, ప్రతి వాహనం వివరాలను నమోదు చేయాలని సూచించారు. చెక్ పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును గమనించారు. నిరంతరం నిఘా కొనసాగేలా సాంకేతికతను ఉపయోగించుకోవాలని సీపీ సూచించారు.
చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి కల్పించిన మౌలిక వసతులను సీపీ పరిశీలించారు. ఎండ తీవ్రత దృష్ట్యా సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. చట్టాన్ని అతిక్రమించి పశువుల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో సీపీ వెంట ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, రూరల్ ఏసీపీ విజయకుమార్, ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్, ప్రదీప్ కుమార్, ఎస్సైలు సాంబమూర్తి, వంశీకృష్ణ, నరేష్ రెడ్డి స్థానిక పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

