కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లాలో ఐదేళ్ల క్రితం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం కేసులో న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. నిర్లక్ష్యంగా బస్సు నడిపి ఒకరి ప్రాణాన్ని బలిగొన్న ఆర్టీసీ డ్రైవర్కు కరీంనగర్ కోర్టు (Karimnagar Court) ఐదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే.. 2020 సంవత్సరంలో దుర్షేడ్ వద్ద రోడ్డు దాటుతున్న శ్రీనివాస్ అనే వ్యక్తిని ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అక్కడికక్కడే మరణించారు.
ఈ ప్రమాదానికి సంబంధించి కేసును విచారించిన కరీంనగర్ కోర్టు, సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారిస్తూ.. ఆర్టీసీ డ్రైవర్ దామోదర్కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 1,000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ ఘోర ప్రమాదం జరిగిన నేపథ్యంలో, సదరు డ్రైవర్ దామోదర్ను ఆర్టీసీ యాజమాన్యం అప్పట్లోనే ఉద్యోగం నుంచి తొలగించింది. రోడ్డుపై అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ తీర్పు మరోసారి నిరూపించింది. ప్రమాదంలో ఒక ప్రాణం పోవడమే కాకుండా, సదరు డ్రైవర్ ఉద్యోగం కోల్పోయి ఇప్పుడు జైలు పాలు కావాల్సి వచ్చింది.

