కలం, కరీంనగర్ బ్యూరో : బక్రీద్ వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా (Karimnagar Collector Chitra Mishra) అధికారులను ఆదేశించారు. శనివారం కరీంనగర్ రేకుర్తి సాలె నగర్లో బక్రీద్ వేడుకల ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలంతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిపి బక్రీద్ వేడుకల సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలకు ఎంత మంది హజరవుతారు.. సౌకర్యాలు కల్పనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ, మున్సిపల్ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి, వేడుకలకు అవసరమైన సౌకర్యాలు, వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు పలు అంశాలను జిల్లా కలెక్టర్, సీపీ దృష్టికి తీసుకువచ్చారు.
విద్యుత్ సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎండాకాలం దృష్ట్యా పెద్ద మొత్తంలో కూలర్లు ఏర్పాటు చేయాలని, అలాగే లైటింగ్తో పాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ, అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆర్డీఓ కే మహేశ్వర్, తహసిల్దార్ వెంకటలక్ష్మితో పాటు ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

