Mobile Popup Ad
Mobile Popup Ad

మరణించిన యువకుడికి మ్యారేజ్ సర్టిఫికెట్.. మణుగూరులో షాకింగ్ మోసం

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (Manuguru) మండలంలో కళ్యాణ లక్ష్మీ పథకం (Kalyana Lakshmi Scheme) లబ్ధి కోసం నకిలీ పత్రాలు సృష్టించిన వ్యవహారం స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేయడానికి కొందరు కేటుగాళ్లు ఏకంగా మరణించిన వ్యక్తి పేరిట మ్యారేజ్ సర్టిఫికెట్ సృష్టించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. స్థానికుల వివరాల ప్రకారం, మణుగూరుకు చెందిన సాయి కుమార్ అనే యువకుడు 2023లోనే మృతి చెందాడు. అయితే, కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా డబ్బులు పొందేందుకు 2024లో అతనికి వివాహం జరిగినట్లు బూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి అధికారికంగా మ్యారేజ్ సర్టిఫికెట్ జారీ కావడం పెద్ద వివాదానికి దారి తీసింది.

సంవత్సరం క్రితమే చనిపోయిన వ్యక్తికి, ఏడాది తర్వాత పెళ్లయినట్లు అధికారికంగా వివాహ ధృవీకరణ పత్రం ఎలా జారీ అయిందనే అంశం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో బూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది, స్థానిక దళారుల ప్రమేయం ఉందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా, కనీస నిబంధనలు పాటించకుండా ఇలాంటి సర్టిఫికెట్లు ఎలా జారీ చేస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన పేదలకు అందాల్సిన కళ్యాణ లక్ష్మీ పథకాన్ని నకిలీ పత్రాలతో దోచుకోవడం దారుణమని మండిపడుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మణుగూరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దొంగ సర్టిఫికెట్లు సృష్టించిన వారితో పాటు, సహకరించిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>